వైసీపీ తాడేపల్లి కార్యాలయంలో జగన్.. కార్యకర్తలకు అధినేత భరోసా

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం స్తబ్ధుగా ఉన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం తిరిగి తెరచుకుంది. ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కార్యాలయానికి వెళ్లి అధినేత జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు జగన్ భరోసా ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఎదురైన ఇబ్బందులు, క్షేమ సమాచారం తెలుసుకున్నారు. అన్నీ సర్దుకుంటాయంటూ ఈ సందర్బంగా జగన్ హామీ ఇచ్చారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. పలువురు కార్యకర్తలు తమకు ఎదురైన ఇబ్బందులను జగన్‌కు వివరించుకున్నారు.

కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు. హత్యలకు కూడా పాల్పడుతున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇటీవలే దేశరాజధాని న్యూఢిల్లీలో నిరసన కూడా చేపట్టారు. జగన్ ఆందోళనకు ఇండియా కూటమి పార్టీలు కొన్ని మద్దతు పలికాయి. అయితే రాష్ట్రంలో జగన్ చెబుతున్న పరిస్థితులు లేవని, వ్యక్తిగతంగా జరుగుతున్న దాడులను సైతం ప్రభుత్వానికి అంటగడుతున్నారంటూ కూటమి నేతలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తల బాధలు వినేందుకు తాడేపల్లి కార్యాలయంలో జగన్ అందుబాటులోకి వచ్చారు.

YSRCP
YSRCP Thadepalli Office
YS Jagan

More Telugu News